Saturday, October 20, 2007

పోరాటం చేసే ముంది ఆలోచించాలి

తగు సమయము గమనించక
పగవారల బలిమి గనక ఫలమెంచక తా
పొగరుగ తలబడు మొరకుడు
నగవులపాలై కడచును నష్టము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పగవారు = శత్రువులు
బలిమి = శక్తి
కను = చూడు
ఎంచు = అంచనా వేయు
మొరకుడు = మూర్ఖుడు
నగవులపాలవ్వు = నవ్వులపాలవ్వు
కడచు = అనుభవించు, నశించు

భావము:
--
ఒకరితో పోరే ముందు, మన శక్తినీ, వారి శక్తినీ అంచనా వెయ్యాలి. తగిన సమయము చూసుకొని ముందడుగు వేయాలే తప్ప, పొగరుగానో ఆవేశంగానో ముందుకు పోకూడదు. మనకి వచ్చే ప్రయోజనం కంటే ఎక్కువ శ్రమపడితే మనం ఓడిపోయినట్లే. మంచిచెడులు చూసుకోకుండా తెగించి ఓడిపోయినవారిని చూసి నలుగురూ నవ్వుతారు కూడా.

నా బాల్యంలో "ఏడు ఘడియల రాజు" అనే కథ చదివాను. అందులో ఒకని జాతకంలో ఏడు ఘడియల పాటు రాజుగా ఉండాలి అని వ్రాసిపెట్టి ఉంటుంది. వాడు ఒకానొక రాజు మీద దండెత్తగా ఆ రాజు ఈ విషయం తెలుసుకుని, రాజ్యం వానికి ఇచ్చేసి, ఏడు ఘడియల తరువాత తిరిగి దండెత్తుతాదు. దానితో "ఏడు ఘడియల రాజు" కథ సమాప్తం. ఇక్కడ తగిన సందర్భం చూసుకున్న రాజు ఓడినట్లు కనబడినా నెగ్గాడు.

భారతంలో కృష్ణుడు, ఒక పురోహితుణ్ని రాయబారిగా, దుర్యోధనుడికి చెబుతాడు: "నువ్వు పాండవుల సేన ఏడు అక్షౌహిణిల సేన అనుకుంటున్నావు. నీది పదకొండు కదా అని విర్రవీగుతున్నావు. కానీ సాత్యకీ, భీమ, నకుల, సహదేవులు ఒక్కొక్కరూ ఒక్కొక్క అక్షౌహిణీ సేనకు సమానం. ఇక అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉంటే వారి ముందు మీ సేన నిలబడనే లేదు", అని. ఇక్కడ దుర్యోధనుడు మిక్కిలి తెలివైన, రాజకీయం తెలిసినవాడైనా, పొగరుతో అవతలవారి శక్తిని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయాడు.

No comments: