Monday, August 18, 2014

ధనం - నిద్ర

ఉదరము నిండిన ధనికుడు
పదవికి పోరుచు పరుపున పడుకొనకుండన్
కదలగనోపిక కరువై
నిదురించును పేదవాడు నేలనె శాస్త్రీ

భా:- ఈ రోజు ధన, పదవీ కాంక్షలు విడ్డూరంగా ఉన్నాయి. లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, పదవుల నిచ్చెన ఎక్కడానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళకు పరుపున్నా నిద్ర పట్టదు. కడుపు నిండా తినడానికి అన్నం లేని వాడు, ఉన్న దానితో సంతృప్తి పడి సగం ఆకలితో నేల మీదనే బాగా నిద్రపోతున్నాడు.

Sunday, July 13, 2014

కోహం

దేహము నేనను భావము
ఊహకు రానీక బ్రతుకు, ఓర్చుము తపనన్
గేహము యజమానవునా
"కోహం" ప్రశ్నే తొలచును కోర్కెలఁ శాస్త్రీ

భా:- జీవి దుఃఖాలకు కారణం దేహాత్మబుద్ధి. అంటే "ఈ శరీరమే నేను" అనే భావం. ఆ భావాన్ని విడిచిపెడితే ఏ సమస్యా లేదు. మనం అరిషడ్వర్గాలు ఆరు అనుకున్నా వాటికి మూలం కోరికే (కామం). ఆ కోర్కెలను తొలగించుకునే మార్గం రమణ మహర్షి చెప్పినట్టు "ఎవరికీ కోరిక" అని ఆలోచించడమే. "నేను ఎవరిని" అనే ప్రశ్నే రగులుతున్న కోర్కెలను కడిగేస్తుంది. 

"నా శరీరం" అని మనం అనుకున్నప్పుడు "శరీరం నేను కాదు", అనే భావం తేట పడుతోంది కదా. ఇంట్లోంచి యజమాని గొంతు వినిపించనంత మాత్రాన ఇల్లే మాట్లాడుతోంది అనుకోవడం ఎంత వివేకమో శరీరం ద్వారా జీవుడి కర్మలు జరుగుతున్నందున ఆ శరీరమే జీవుడు అనుకోవడం కూడా అంతే వివేకం.

ఇదంతా చెప్పడానికి బాగుంది కానీ, నేను పూర్తిగా ఆచరించట్లేదు. ఈ రోజు గురు పౌర్ణిమ కాబట్టి "శ్రీ రమణ మహర్షి" బోధలను అనుసరించి ఈ పద్యం చెప్పటం జరిగింది.

Sunday, April 13, 2014

గురుపాదములు

సిరులెన్నైననుఁ జాలవు
తరుణుల సరసము చివరికు తలనొప్పేయౌ
పరమగు పదవిని పొందగ
గురుపాదములందు భక్తిఁ గోరుమ శాస్త్రీ!

భా:- మనుషులను నడిపేవి మూడు: డబ్బు, అధికారం, స్త్రీలోభం. దీన్నే శ్రీ రామకృష్ణులు  "కామినీ కాంచనాలు" అనేవారు. ఇవి మనసును భ్రమింపజేసినట్టుగా మాతృభక్తి కూడా చెయ్యలేదు. ఇవి ఎంత పొందినా సంతృప్తి ఉండదు. అన్నిటికంటే ఉత్తమమైన సిరి, సుఖం, పదవి - ముక్తి. అది పొందాలంటే గురుపాదాల మీద అచంచలమైన భక్తీ ఉండాలి. అది కలగాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. అది కోరుకోవాలి. మిగతావి అన్నీ కలవంటివే.

నిదుర

నిదురించిన మది కానదు
కదిలించెడి దుఃఖములను గమ్మనియుండున్
మెదలును మెలకువ కలిగిన 
మది నిదురను చెదరనీక మనరా శాస్త్రీ!

భా: గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు (సుషుప్తి) మనకు ఏ దుఃఖము, బాధ గుర్తుండవు. శాంతంగా ఉంటాము. అదే నిదుర లేచాక అనేక ఆలోచనల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాము. దుఃఖం కనిపిస్తుంది. అదే మదిని (దేహాన్ని కాదు) ఎప్పుడూ నిద్రలో ఉంచగలిగితే అదే మోక్షం కదా?

నేను "నిద్రపోయాను" అన్నప్పుడు మనసు నిద్రపోతోంది కానీ ఆత్మ కాదు. ఆత్మ చైతన్య స్వరూపం. దానికి నిదుర లేదు. అశాస్వతమైనది, పరిమితమైనది, చాంచల్యం కలిగినది మనసు మాత్రమె. ఆ మానసు అపరిమితమైన ఆత్మను పరిమితమని నమ్మించడం వలన దుఃఖం కలుగుతోంది. ఆ మనసును అదుపులో ఉంచుకుని శాంతపరిస్తే, చివరకు అదే మాయమయ్యి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.