Sunday, July 13, 2014

కోహం

దేహము నేనను భావము
ఊహకు రానీక బ్రతుకు, ఓర్చుము తపనన్
గేహము యజమానవునా
"కోహం" ప్రశ్నే తొలచును కోర్కెలఁ శాస్త్రీ

భా:- జీవి దుఃఖాలకు కారణం దేహాత్మబుద్ధి. అంటే "ఈ శరీరమే నేను" అనే భావం. ఆ భావాన్ని విడిచిపెడితే ఏ సమస్యా లేదు. మనం అరిషడ్వర్గాలు ఆరు అనుకున్నా వాటికి మూలం కోరికే (కామం). ఆ కోర్కెలను తొలగించుకునే మార్గం రమణ మహర్షి చెప్పినట్టు "ఎవరికీ కోరిక" అని ఆలోచించడమే. "నేను ఎవరిని" అనే ప్రశ్నే రగులుతున్న కోర్కెలను కడిగేస్తుంది. 

"నా శరీరం" అని మనం అనుకున్నప్పుడు "శరీరం నేను కాదు", అనే భావం తేట పడుతోంది కదా. ఇంట్లోంచి యజమాని గొంతు వినిపించనంత మాత్రాన ఇల్లే మాట్లాడుతోంది అనుకోవడం ఎంత వివేకమో శరీరం ద్వారా జీవుడి కర్మలు జరుగుతున్నందున ఆ శరీరమే జీవుడు అనుకోవడం కూడా అంతే వివేకం.

ఇదంతా చెప్పడానికి బాగుంది కానీ, నేను పూర్తిగా ఆచరించట్లేదు. ఈ రోజు గురు పౌర్ణిమ కాబట్టి "శ్రీ రమణ మహర్షి" బోధలను అనుసరించి ఈ పద్యం చెప్పటం జరిగింది.

No comments: