హరిహరులకు భేదమెంచి యధికుడెవడనన్
యిరువురునొకటేనన్నది
యెరుగని నీలోని మాయె హెచ్చుర శాస్త్రీ
భావం: పరమాత్ముణ్ణి దర్శించలేక శివుడు గొప్పా? విష్ణువు గొప్పా? అని ప్రశ్నిస్తున్నావు అంటే ఆ రెండు రూపాలలో ఉన్న పరమైనశక్తి ఒకటేనన్న విషయాన్ని గ్రహించలేని నీలోని మాయ బలమైనది అని సంకేతం.
వివరణ: శివుడు గొప్పా? కేశవుడు గొప్పా అన్న విషయానికి అనేకమంది అనేక సమాధానాలు ఇచ్చారు. పురాణాలను రచించిన వ్యాసభగవానుడు కూడా ఒక్కో పురాణంలో ఒక్కోలాగా చెప్పాడు. కొందరి చర్చించుకున్నారు, కొందరు వాదించుకున్నారు, కొందరు ద్వేషించుకున్నారు, కొందరి కొట్టుకున్నారు. కానీ ఒక్క విషయం గమనించాలి. ప్రపంచాన్నంతటినీ సృష్టించినది ఒక శక్తే ఐతే ఆ శక్తికి ఒక భాషేమిటి? ఒక రూపమేమిటి? ఒక లింగభేదమేమిటి? ఒక గుణమేమిటి? పరమాత్మ ఒక్కటే! మన చూసే దృష్టిని బట్టి ఒక్కో ఆకారంలో కనిపిస్తాడు. మన ఉపనిషత్తులలో కూడా "తత్ త్వం అసి" అని అన్నారు కదా?
మన వైదీక సంస్కృతిలో ఒక గొప్పదనం ఉంది. ఒకరే దేవుడు అని మనం అనము. అమ్మ, నాన్న, గురువు, పెద్దలు, పిల్లలు అందరినీ దేవుళ్ళంటాము. గోవు, పాము, ఎద్దు, ఏనుగు ఇలా జీవరాశినంతా పరమాత్మ ప్రతిరూపాలుగా పూజిస్తాము. కాకి, కుక్క, కోతి అని భేదం చూపించకుండా వాటిని పోషిస్తాము. చెట్టుని, అడవిని, కొండని, రాయిని, పుట్టనీ కూడా పూజిస్తాము. అన్నింటిలోనూ ఆ పరమాత్మను చూడాలి అన్న మన సంస్కృతి పరమార్థాన్ని గ్రహించకుండా ఎవరు గొప్ప అని కొట్టుకోవడం అవివేకం కదా?
1 comment:
మీ బ్లాగ్ కే మీకు పునః స్వాగతం సందీప్ గారూ...పద్యం కూడా చాలా బాగుంది. వివరణ చూసుకోకపోయినా అర్ధమైంది.
చాలా బాగా చెప్పారండీ. సృష్టి లోని ప్రతీ ప్రాణీ పరమాత్మ స్వరూపమే..
Post a Comment