Wednesday, September 12, 2007

ఆడువారికి వేదాంతం మప్పటం కష్టం

భగభగ మండెడి నిప్పుకు
తగులిన యింధనమువోలె తాపాగ్నులజే
రగిలెడి రమణికి చెప్పిన
నిగమాంతములున్ తగులడు నిక్కము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
తాపాగ్నులు = తాపత్రయాలు (ఆధ్యాత్మిక, అధిభౌతికము, అధిదైవికము ఐన కష్టాలు, చింతలు)
రగులు = రాజుకొను, మండు
నిగమాంతములు = వేదాంతములు
నిక్కము = నిజము

భావము:
--
కోపం/ఆవేశం/దుఃఖంలో ఉన్న స్త్రీకి మనం చెప్పే వేదాంతధోరణి నచ్చదు.

ఆడువారికి వేదాంతములు, వైరాగ్యధోరణీ అలవడటం కష్టం. అందుకే మగజన్మని కొంత ఉన్నతంగా కొన్ని పురాణాలలో చెప్పారు.

ఐతే దీనికి స్త్రీలు కోపం పడవలసింది లేదు. ఎందుకంటే తమనుండి మరొకరికి జన్మనిచ్చే అదృష్టం భగవంతుడు స్త్రీలకే ఇచ్చాడు. అందుచేతనే వారికి పేగు బంధం మగవారి కంటే ఎక్కువ. వారికి భౌతికమైన బంధాలు ఇంకా బలీయమైనవి. మన పురాణాల్లో అందుకే భర్త చేసిన ప్రతీ తపస్సు వంటి సత్కార్యాలలో భార్యకూ సగం పుణ్యం లభిస్తుంది అని చెప్పారు.

ఈ పద్యము ఎవరికైనా కోపం కలిగించి ఉంటే మన్నించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇది కేవలం నా అనుభవం.

No comments: