Saturday, September 29, 2007

ఆడువారికి భావావేశాలు ఎక్కువ

జగడము గోరుచు యనినను
తగునుర విన త్రాగుబోతు తర్కపుకూతల్
మగువలు కాంతాళముతో
వెగటుగ పలికిన వినకనె విడువర శాస్త్రీ

కొన్ని పదములకు అర్థములు:
--
జగడము = తగువు
తర్కము = వాదము, గొడవ
కూత = కేక
కాంతాళము = దు:ఖము వలన కలిగిన కోపము
వెగటు = చేదు, కించపరిచెడి

భావము:
--
ఆడువారికి భావావేశాలు ఎక్కువ. వారి హృదయం సున్నితం. అందుకే కొంచెం కష్టం వారికి కలిగినా, వారికి ఇష్టమైనవారికి కలిగినా ఓర్వలేరు. ఆ ఆవేశంలో ఎంత మాటలైనా అంటుంటారు. అలాంటి మాటలను పట్టుకుని వారికి దూరంగా జరుగడం మగవారు చెయ్యవలసిన పని కాదు.

ఉదాహరణగా మన రామాయణం తీసుకుందాం. మారీచుడు "హా లక్ష్మణ, హా సీతా" అన్నప్పుడు - లక్ష్మణుడు ఎంతో నమ్మకంగా "మా అన్నగారికి ఎటువంటి ఆపదా రాదు - ఇది మారీచుని కుట్ర అయ్యి ఉండవచ్చు", అని చెప్తుంటే సీత మాత్రం: "లక్ష్మణ, ఒక తమ్ముడు రాజ్యం అపహరిస్తే మరొక తమ్ముడు అన్నగారి భార్యనే ఆశిస్తున్నాడు. నీ పన్నాగాలు పారవు. నేను ప్రాణత్యాగం చేస్తానేమో కానీ నీకు దక్కను", అంటూ ఎన్నో సూటిపోటి మాటలతో లక్ష్మణున్ని బాధపెట్టి తమ కుటీరంనుండీ పంపించింది. ఆ తరువాతా ఏమి జరిగిందో అందరికీ తెలుసును. వదిన పాదాలను తప్పితే తలెత్తి ఎప్పుడూ చూడని వాడు అని సీతకు తెలియకనే అలాగ ప్రవర్తించలేదు. కేవలం రాముడు ఏ కష్టాలలో ఉన్నాడో అనే కంగారులోనే అలాగ అంది.

No comments: